SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
...

Iran - Israel War : హిజ్బుల్లా–ఇజ్రాయెల్‌ పోరుతో పెరుగుతున్న ఉద్రిక్తతలు

లెబనాన్‌ నుంచి వెళ్లాలన్న ఆదేశాన్ని ఇరాన్‌ బహిరంగంగా తిరస్కరించింది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 7:29 am

నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు

49 సంస్థలు ఆడిట్‌కు సహకరించలేదు.. మూసివేత దిశగా 16 సంస్థలు 6 సంస్థలు లాభాలు, 11 సంస్థలు నష్టాల్లో... సింగరేణిలో రూ.251 కోట్ల మేర నిధులు దుర్వినియోగం సింగరేణి బొగ్గు రవాణాలో లోపాల వల్ల రూ.25 కోట్ల నష్టం కాగ్ నివేదికలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్ ఆయా సంస్థల నష్టాలు, వార్షిక బడ్జెట్ వివరాల గురించి వెల్లడించింది. కాగ్ 2022, 23 సంవత్సరానికి సంబంధించి పలు శాఖల పనితీరు, వాటి వివరాలను కాగ్ అసెంబ్లీకి నివేదించింది. రాష్ట్రంలోని మెజారిటీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, కనీసం లెక్కలు సమర్పించడంలోనూ నిర్లక్ష్యం వహించాయని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయని, మిగిలిన 67 సంస్థల్లో ఏకంగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించలేదని, కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్‌కు సహకరించాయని కాగ్ ఈ నివేదికలో తెలిపింది. 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా, 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని కాగ్ పేర్కొంది. 9 సంస్థల నెట్‌వర్త్ (నికర విలువ) నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయిందని, మొత్తం మీద ఈ సంస్థల నెట్ వర్త్ రూ.50,930 కోట్లకు పడిపోయిందని కాగ్ తెలిపింది. ఈ సంస్థల్లో ప్రభుత్వం చేసిన మొత్తం పెట్టుబడులు రూ.98,572 కోట్లు కాగా, సింగరేణి కాలరీస్‌పై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అవకతవకలను గుర్తించింది. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగించినట్లు గుర్తించింది. కాంట్రాక్టుల్లోని లోపాల వల్ల రూ.251 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని నిబంధనలను అమలు చేయడంలో రూ.74 కోట్ల అదనపు భారం పడగా, బొగ్గు రవాణాలో లోపాల వల్ల రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. ట్రాన్స్‌ఫోర్ట్ ఛార్జీల పేరుతో రూ.1,078 కోట్ల అదనపు వసూళ్లు జరిగినట్లు కాగ్ నివేదికలో తెలిపింది. . 15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరు సంస్థల పాలనలో తీవ్ర లోపాలున్నట్లు నివేదిక వేలెత్తి చూపింది. 15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరని ఎక్కడా డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదని 5 సంస్థల్లో ఆడిట్ కమిటీలు, 9 సంస్థల్లో ఎన్‌ఆర్‌సి లేదని నివేదికలో కాగ్ తెలిపింది. పర్యావరణ నిబంధనలను పాటించడంలో సింగరేణి విఫలమైందని, ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని కాగ్ పేర్కొంది. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరుపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలని కాగ్ సూచించింది. పెండింగ్‌లో ఉన్న వార్షిక ఖాతాలను వెంటనే పూర్తి చేసి సమర్పించాలని, కాంట్రాక్టుల్లో లొసుగులు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కాగ్ నివేదికలో పేర్కొంది.

మన తెలంగాణ 31 Mar 2026 6:50 am

డీలిమిటేషన్ తో సీట్ల వ్యత్యాసంలో తేడా రావొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః లోక్‌సభ సీట్ల విషయంలో కేంద్రం చేపట్టనున్న డీ-లిమిటేషన్ ఫార్మూలా ఏదైనా ప్రస్తుతం దక్షిణ-ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న వ్యత్యాసమే భవిష్యత్తులో కూడా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం చేపట్టనున్న డీ-లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు భారీగా నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. తమ ఐదేళ్ళ పాలన గడువు ముగిసిన తర్వాత జమిలి ఎన్నికల నిర్వహించే సమయం వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ డాక్టర్ లక్ష్మణ్ వితండవాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించరా? అని ఆయన ప్రశ్నించారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో, లెక్కలు రావేమో అర్థం కావడం లేదన్నారు. మీలో ఎవరికైనా లెక్కలు బాగా వస్తే డాక్టర్ లక్ష్మణ్‌కు చెప్పాలని ఆయన విలేకరులనుద్ధేశించి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల కోసం డాక్టర్ లక్ష్మణ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అన్నారు. డీ-లిమిటేషన్‌పై బిజెపి నాయకులు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. బ్రూటల్ మెజారిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తిరుగులేని పాలన వస్తే నియంతృత్వం వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల సమస్య కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడు 543 లోక్‌సభ సీట్లు ఉన్నాయని, అందులో సగం సీట్లు 272 పెంచాలని కేంద్రం భావిస్తున్నదని ఆయన చెప్పారు. దీంతో దేశ వ్యాప్తంగా 815 సీట్లు అవుతాయన్నారు. ఉదాహరణకు ఉత్తర్ ప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయని, డీ-లిమిటేషన్‌తో 120కి పెరుగుతాయని చెప్పారు. అదేవిధంగా తమిళనాడులో 40 ఉన్నాయని, డీ-లిమిటేషన్‌తో 60కి పెరుగుతాయని ఆయన తెలిపారు. ఉత్తరాదిలో ఇలా పెద్ద రాష్ట్రాలతో ఎక్కువ సీట్లు పెరుగుతాయన్నారు. పైగా దేశ వ్యాప్తంగా పెరిగే 272 సీట్లు మహిళా రిజర్వేషన్‌కు సరిపోతాయని అంటున్నారని ఆయన చెప్పారు. అయితే డీ-లిమిటేషన్ ఫార్ములా ఏదైనా ప్రస్తుతం దక్షిణాది-ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసమే భవిష్యత్తులోనూ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు అంటే చిన్న చూపు ఉందని, భవిష్యత్తులో ఉత్తరాదిలో సీట్లు గణనీయంగా పెరిగితే, దక్షిణాదికి సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, ప్రజా సమస్య అని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము దక్షిణాది రాష్ట్రాల పార్టీలను కలుపుకుని పోనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వస్తారని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. కెసిఆర్ గృహ నిర్బంధంలో.. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గురించి ప్రశ్నించగా, కెసిఆర్ విశ్రాంతి తీసుకోవడం లేదని, గృహ నిర్బంధంలో ఉన్నారని అనుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:50 am

ఈగల్, హైడ్రా తరహాలో.. కల్తీ కట్టడికి కొత్త వ్యవస్థ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కల్తీ మాఫియా ఆట కట్టించేందుకు ఈగల్, హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ తీసుకుని వస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆహార కల్తీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నిరోధానికి దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడాతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కల్తీ తిను బండారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనేక మంది కల్తీ ఆహారం తీసుకుని ఆసుపత్రి పాలవుతున్నారని, ఇంకా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కాబట్టి ఇకమీదట కల్తీ వ్యాపారుల ఆట కట్టిస్తానని ఆయన హెచ్చరించారు. రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడడం లేదన్న ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని గత ఏడాది ఉగాది రోజున ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందు కోసమే క్వింటాలుకు రూ. 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామని ఆయన వివరించారు. అడిగిన వారందరికీ రేషన్ కార్డు జారీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే తమ వస్తువు ధరను నిర్ణయిస్తారు కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అని ఆయన తెలిపారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీగా పిడి యాక్ట్ (చట్టం) తీసుకొచ్చిందన్నారు. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని ఆయన చెప్పారు. కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలుత పేదలకు రేషన్ కార్డులున్న వారికి కిలో రూపాయి తొంబై పైసలకు ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఎన్టీరామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంగా మార్చి ముందుకు తీసుకెళ్లారని ఆయన వివరించారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోందని, ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారని ఆయన తెలిపారు. దొడ్డు బియ్యం తినేవారు లేరని గ్రహించి, పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రధాని ఫొటో పెడతాం.. సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ. 14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ఆయన తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్రం మోస్తే పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని ఆయన చెప్పారు. ఈ పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం తమ లక్షమని ఆయన తెలిపారు. అందుకే వరి ఒక్కటే కాదు వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఇందులో మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. పంట మార్పిడి విషయంలో రైతులపై వత్తిడి చేయం, అవగాహన కల్పిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:40 am

సాదాబైనామాలకు తొలగిన అడ్డంకులు

మనతెలంగాణ/హైదరాబాద్: సాదాబైనామాలకు అడ్డంకులు తొలిగాయి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తుదారులకు మేలు జరిగేలా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి జిఓ 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్‌కుమార్ జారీ చేశారు. ఈ జిఓలతో సాదాబైనామాల దరఖాస్తులకు అడ్డంకులు తొలగినట్టయ్యింది. భూభారతి చట్టం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకులతో సాదాబైనామాలకు మోక్షం కలగడం లేదు, దీంతో రెవెన్యూ శాఖ ఈ రెండు జీఓల ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అవలంబించాల్సిన కార్యాచరణ మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. 2016 తరువాత జమాబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పులు, చేర్పులు సాదాబైనామాను పరిష్కారించాలంటే భూమి విక్రయించిన వ్యక్తుల నుంచి అఫిడవిట్‌తో పాటు కొనుగోలు చేసిన వారి దగ్గర సరైన పత్రాలు ఉండాలి. గత ప్రభుత్వ హయం నుంచే పలుమార్లు సాదాబైనామా తెరపైకి రాగా, తెల్లకాగితాలపై చేసుకున్న భూ క్రయ, విక్రయాల సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం ప్రతిసారి సాదాబైనామాల విషయాన్ని ప్రస్తావిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. దీనికి ప్రధానంగా గత యజమానుల అఫిడవిట్ లేక పోవడం, వారుసులు అభ్యంతరాలు తెలపడం, 2016 తరువాత జమాబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేయటం కష్టంగా మారింది. తాజాగా విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని, కొనుగోలు చేసిన వ్యక్తి తప్పుడు రికార్డు సృష్టిస్తే చర్యలకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలు లేనట్లయితేనే దరఖాస్తులను పరిష్కరించి పట్టా జారీ చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది. తెల్లకాగితాలు, స్టాంప్ పేపర్ల ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారు వాటిని సాగు చేసుకుంటున్నప్పటికీ పలు సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ప్రభుత్వం ఈ మార్పులు, చేర్పులను చేస్తూ కొత్తగా జిఓలను జారీ చేసింది. జీఓ నెం.76 ప్రకారం భూమిని కొనుగోలు చేసి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే అయితే, అమ్మిన వ్యక్తి కాదు కొన్న వ్యక్తి భూభారతి చట్టంలోని సెక్షన్ (6) ప్రకారం సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే వెసులుబాటు కల్పించినా ఆ తర్వాత రెవెన్యూ శాఖ జారీ చేసిన నిబంధనలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీ కోసం అప్పట్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన ఇబ్బందిగా మారింది. ఈ నిబంధనపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడం, రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.76 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం భూమిని కొనుగోలు చేసి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తో పాటు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీఓ పరిశీలిస్తారు. సదరు అఫిడవిట్ సమర్పించిన దరఖాస్తులు 30 రోజుల పాటు పెండింగ్‌లో పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అఫిడవిట్‌తో పాటు డాక్యుమెంట్లను పరిశీలించి సదరు రైతుకు సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే, కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని ఎప్పుడు తేలినా సదరు సర్టిఫికెట్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం రైతు చెల్లించే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కి ఇవ్వరు. దీంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయినా జిఓ 77 కింద పరిష్కారం గ్రామాలుగా ఉన్నప్పుడు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించినా ప్రస్తుతం ఆ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయినా ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీఓ నెంబర్‌ను 77 జారీ చేశారు. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటయినప్పుడు చాలా గ్రామాలు వాటిలో విలీనం అయ్యాయి. భూభారతి చట్దానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో సాదాబైనామాలు చేయాలా వద్దా అనే దానిపై రెవెన్యూ అధికారులకు స్పష్టత లేదు. దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు పట్టణాల్లో కలిసిన గ్రామీణ ప్రాంతాల్లోని సాదాబైనామాల పరిష్కారానికి 77 జీఓలో వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసే నాటికి అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, క్షేత్రస్థాయిలో ఈ సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియ పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు జారీ చేసేలా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ)కు అనుమతినిస్తున్నట్టు ఈ జిఓలో ఉత్తర్వులు జారీ చేశారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:40 am

31marchchintana |ఆధ్యాత్మికత, ప్రశాంతత మనిషి నిజమైన గమ్యం..

31marchchintana | ఆధ్యాత్మికత, ప్రశాంతత మనిషి నిజమైన గమ్యం.. 31marchchintana | జీవితం

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:36 am

పెను విధ్వంసం

ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక చమురు, ఇంధన, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని వార్నింగ్ మరింత తీవ్రమయిన గల్ఫ్ యుద్ధం కువైట్‌పై ఇరాన్ దాడుల్లో భారతీయుడు మృతి ఇజ్రాయెల్ అణు చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు పాక్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ తిరస్కరణ వాషింగ్టన్: ఇరాన్ వెంటనే హర్మూజ్ జలసంధిని రాకపోకలకు తిరిగి తెరవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించా రు. ముందు హర్మూజ్ ఓపెన్ చేయండి లేకపో తే ఇరాన్ చమురు, ఇంధన మౌలిక సదుపాయాలపై భీకర దాడులు తప్పవని సోమవా రం హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన స్థావరాలను ఎంచుకుని దాడు లు జరుగుతాయని తెలిపిన ట్రంప్ పరోక్షంగా తమ పదాతిదళం ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవిని స్వాదీనపర్చుకుంటుందని పేర్కొన్నారు. ఇంతకాలం చర్చల పురోగతి విషయం ప్రస్తావిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగా రు. అమెరికా ఇప్పుడు ఇరాన్‌లోని సముచిత, సహేతుక అధికారిక వ్యవస్థతతో గణనీయ చ ర్చలలో ఉంది. తమ సైనిక చర్యల నిలిపివేత దిశలో ఈ చర్చలు సాగుతున్నాయని చెప్పిన ట్రంప్, ఇవి ఇరాన్‌కు అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషించారు. ఈ చర్చలు ఫలించకపోయినా, హర్మూజ్ తిరిగి ప్రారంభించకపోయినా అమెరికా నుంచి ఇరాన్ స్థావరాలపై ఉధృత దాడులు తప్పవని ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇప్పటికైతే చర్చలలో పురోగతి ఉందని, డీల్ కుదిరే అవకాశం ఉందని ప్రకటించారు. ఇరాన్ ఇకపై తమ దేశ విద్యుత్ ఉత్పాదక స్థావరాలు పనిచేయాలనుకున్నా, ఖర్గ్ ఐటాండ్‌లోని చమురు బావులు నిలబెట్టుకోవాలనుకున్నా డీల్‌కు దిగిరావాల్సిందే అని స్పందించారు. పలు రకాలుగా ఇరాన్‌ను స్తంభింపచేయడం జరుగుతుంది. అక్కడి జలశుద్ధి కేంద్రాలను కూడా దెబ్బతీస్తామని , ఇప్పటివరకూ తాము ఈ డిసాలినేషన్ ప్లాంట్స్ జోలికి వెళ్లలేదని గుర్తుచేశారు. 47 సంవత్సరాల ఇరాన్ గత ఉగ్రపాలకుల చర్యలతో మృతి చెందిన అమెరికన్లకు సరైన నివాళిగా ఇప్పటి చర్చలు నిలుస్తాయని తెలిపారు. ఈ విషయంపై దృష్టి సారిస్తే సంతోషం అని కూడా తన సహజధోరణిలో వ్యాఖ్యానించారు. చర్చలు, భీకర దాడుల హెచ్చరికలతో ట్రంప్ ఒకే సారి పరస్పర వైఖరిని చాటారు. ఖర్గ్‌ను స్వాధీనపర్చుకోవచ్చు లేదా వదిలేయవచ్చు అంటూనే ఇరాన్‌ను దారికి తీసుకువచ్చేందుకు అమెరికా వద్ద పలు మార్గాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి 20 వరకూ అమెరికా చమురు ట్యాంకర్ నౌకలను హర్మూజ్ నుంచి తరలించేందుకు ఇరాన్ అంగీకరించిందని కూడా వెల్లడించారు. ఇది తమ పట్ల ఇరాన్‌కు ఉన్న గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దాదాపుగా పాతికవేల వరకూ అమెరికా మెరైన్లు ఈ ప్రాంతంలో మొహరించి ఉన్నా, మరికొందరు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నా ఇరాన్ ఈ దశలో సానుకూలరీతిలో స్పందించడం తాము గుర్తించామని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇరాన్ చేయాల్సింది చేయాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికా దీనికి బదులుగా ఏమి చేయాలో అదే చేసి తీరుతుందని తన సొంత వేదిక ద్వారా ప్రస్తావించారు. గల్ఫ్ యుద్ధం మరింత ప్రజ్వలనం అమెరికా వైమానిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు సోమవారం కూడా తీవ్రస్థాయిలో సాగాయి. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు, గగనతల అభద్రత మరింత పెరిగింది. ప్రస్తుత దశలో తమ దేశ గగనతలం నుంచి అమెరికా యుద్ధ విమానాలను అనుమతించేది లేదని స్పెయిన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌తో యుద్థానికి వాడే అమెరికా విమానాలకు తమ దేశం అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరిటా రోబ్లెస్ సోమవారం మాడ్రిడ్‌లో చెప్పారు. ఇక్కడ అమెరికాతో కలిసి స్పెయిన్ సంయుక్త సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది. వీటిని ఇరాన్‌పై దాడులకు వినియోగిస్తే తమ భద్రతకు భంగకరం అని స్పెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం ఆరంభం నుంచే తాము అమెరికాకు ఈ విషయంలో స్పష్టంగా తెలియచేస్తున్నామని స్పెయిన్ రక్షణ మంత్రి మీడియాకు వివరించారు. కువైట్‌పై ఇరాన్ దాడులు .. భారతీయుడు కృష్ణన్ దుర్మరణం ఇరాన్ కువైట్‌పై సోమవారం జరిపిన దాడులలో ఓ భారతీయ వ్యక్తి మృతి చెందారు. ఆయనను సంతాన్ సెల్వం కృష్ణన్‌గా గుర్తించారు. ఇక్కడ డిశాలినేషన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కృష్ణన్ ఇరాన్ క్షిపణి దాడులలో మృతి చెందారు. ఈ ప్రాంతంలోనే పది మంది సైనికులు గాయపడ్డారు. కువైట్‌లోని జలశుద్ధి కేంద్రం, విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడులు జరిగిన విషయాన్ని కువైట్‌లోని భారతీయ ఎంబసీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇరాన్ ఆటవిక దాడికి దిగిందని కువైట్ విద్యుత్, జలవనరులు, ప్రత్నామ్నాయ ఇంధన మంత్రిత్వశాఖ గర్హించింది. ఇప్పుడు జరిగిన దాడిలో మరో భారతీయుడి మృతితో గల్ఫ్ యుద్ధం మొదలైన నాటి నుంచి గల్ఫ్ ప్రాంతంలో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలో భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ధృవీకరించారు. దుబాయ్, కువైట్, రియాద్ ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడులలో క్షిపణి శకలాల ధాటికి చనిపోయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాలలో భారతీయల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ , తగు సాయం అందించేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోలు రూంలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ అణు , చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు ఇరాన్ తమ దేశ ప్రతీకార దాడులలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రధాన అణు పరిశోధనా కేంద్రం వద్ద సోమవారం పెద్ద ఎత్తున సైరన్ మోతలు విన్పించాయి. ఈ కేంద్రాన్ని ఇరాన్ తరచూ లక్షంగా చేసుకుని దాడులకు దిగుతోంది. ఇరాన్ మద్దతు గల యెమెన్ మిలిటెంట్ల నుంచి తమ స్థావరాలపై దాడులు జరిగిన విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.తరువాత ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. ఇక్కడ చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. యుఎఇ నుంచి 85 విమానాలు దాదాపు 85 విమానాల రాకపోకలు అరబ్ ఏమిరేట్స్ నుంచి భారత్‌కు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. సౌదీ అరేబియాలోని పలు విమానాశ్రయాల నుంచి , ఒమన్ నుంచి భారత్‌లోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ఆరంభం అయ్యాయి. ఖతార్ విమానాశ్రయాన్ని పాక్షికంగా తెరిచారు. ఖతార్ ఎయిర్‌వేస్ సోమవారం పది వరకూ విమానాలను భారత్‌కు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కువైట్, బహరైన్ గగనతలాల మూసివేత కొనసాగుతోంది. కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్ , బహరైన్‌కు చెందిన గల్ఫ్ ఎయిర్ సంస్థ తమ విమానాలను సైదీ అరేబియాలోని పలు విమానాశ్రయాల నుంచి అనిర్ణీత షెడ్యూల్స్‌గా భారత్‌కు నిర్వహిస్తోంది. భారతీయ ప్రయాణికులను ముందుగా ఇరాన్‌కు చేర్చి, అక్కడి నుంచి సురక్షిత మార్గాలలో దేశానికి తీసుకువస్తారు. ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాలలోని వారు, ఇరాన్ దాడులకు గురవుతున్న ప్రాంతాల్లోని భారతీయులు ఏదో విధంగా ఇరాన్ చేరుకుంటే అక్కడి నుంచి భారత్‌కు రావడానికి వీలేర్పడుతుంది. 

మన తెలంగాణ 31 Mar 2026 6:30 am

ఏప్రిల్ 4న మూడు మున్సిపాలిటీల చైర్మన్‌ల ఎన్నిక

మన తెలంగాణ/హైదరాబాద్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తో పాటు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యములో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 4 వ తేదీన చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక జరపనున్నట్టు వెల్లడిం చారు. కాగా ఆయా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై బిఆర్‌ఎస్ న్యాయపోరాటం చేసిన విషయం విదితమే.

మన తెలంగాణ 31 Mar 2026 6:20 am

31marcheditorial |ఉద్యమం క్షీణతకు కారణాలు..

31marcheditorial | ఉద్యమం క్షీణతకు కారణాలు.. 31marcheditorial | మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:16 am

గడ్డిమందు పారాక్వాట్‌పై నిషేధం విధించాలి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మనతెలంగాణ/హైదరాబాద్ : గడ్డిమందు పారాక్వాట్ తయారీ, అమ్మకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న పారాక్వాట్ అనే ప్రమాదకర గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజ, పర్యావరణ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని తెలిపారు. పారాక్వాట్ వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతున్నదని పేర్కొన్నారు. క్షణికావేశంలో ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పారాక్వాట్ వంటి అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరప్ సహా అనేక దేశాలలో పారాక్వాట్‌పై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయంగా అనేక గడ్డిమందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్ర అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విజ్ఙప్తి చేశారు. ఈ తీర్మానం ద్వారా రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:10 am

ఎల్‌పిజి కొరతపై కిరోసిన్ అస్త్రం

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వంటింటి పైనా పడింది. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌సమస్యను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కిరోసిన్- రహితంగా ప్రకటించిన 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా సుపీరియర్‌ కిరోసిన్‌ను తాత్కాలికంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లలో 2,500 లీటర్ల వరకూ కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. సుపీరియర్ కిరోసిన్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియను నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు వినియోగిస్తారు. సాధారణ లో గ్రేడ్ కిరోసిన్‌తో పోలిస్తే ఇందులోంచి వెలువడే వాయువులు తక్కువ. పొగ కూడా తక్కువగా వస్తుంది. పశ్చిమ ఆసియాలో నెలరోజులుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింది. ముఖ్యంగా వంటగ్యాస్ సరఫరా ప్రభావితమైంది. భారత్ తన అవసరాల్లో సుమారు 60 శాతం ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుండగా, అందులో 85-90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. యుద్ధ పరిస్థితుల వల్ల ఈ సరఫరా నిలిచిపోవడంతో, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు సరఫరా తగ్గించాల్సి వచ్చింది.ఇంటి వాడుకకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పరిమిత నిల్వల కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొని, గ్యాస్ కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీపై ఒత్తిడి తగ్గించేందుకు దేశవ్యాప్తంగా కిరోసిన్ వినియోగాన్ని కేంద్రం తాత్కాలికంగా అనుమతించింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ మార్చి 29న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నిబంధనలు-2002 కింద తాత్కాలిక మినహాయింపులు ఇస్తునట్లు తెలిపింది. దీని ప్రకారం ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వీస్ స్టేషన్లలో 5,000 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరి. కిరోసిన్ డీకాంటింగ్ (నిల్వ నుంచి పంపిణీ) కోసం ఏజెంట్లు, డీలర్లు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అనుమతులు ఉన్న ట్యాంకర్ వాహనాలకు అదనపు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. 

మన తెలంగాణ 31 Mar 2026 6:10 am

కొన ఊపిరిలో నక్సలిజం

 నక్సల్స్‌కి ఇవి తుది ఘడియలు మోడీ సారథ్యంలో విజయం సాధించాం ఇందిరాగాంధీ రాజకీయ స్వార్థంతోనే నక్సలిజం ఆవిర్భావం కాంగ్రెస్ వైఖరితో గిరిజనులకు తీరని నష్టం గద్దర్‌తో రాహుల్ గాంధీ చర్చలు దేనికి సంకేతం?  లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజం ఇప్పుడు కొన ఊపిరితో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సో మవారం లోక్‌సభలో చెప్పారు. కేంద్రంలోని మో డీ ప్రభుత్వ సారధ్యంలో మావోయిస్టు తీవ్రవాదం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నక్సలిజం అంతానికి నిర్ధేశిత గడువు విధించుకుందని, ఈ మేరకు కార్యాచరణ పూర్తి అయిందని తెలిపారు. మావోయిస్టు హింసాత్మకతకు కేంద్ర బిందువు అయిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సల్స్ విముక్తం అయిందని చెప్పిన అమిత్ షా ఈ దశలో కాంగ్రెస్ పాలకుల తీరుపై మండిపడ్డారు. ఈ ఏడాది మార్చి 31 లోగా నక్సలిజం అంతం అని గతంలో కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. తరువాతి దశల్లో పలు స్థాయిలో పెద్ద ఎత్తున సరెండర్లు, భారీ ఎన్‌కౌంటర్ల ఘట్టాల తరువాత ఇప్పుడు నిర్ణీత డెడ్‌లైన్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర హోం మంత్రి లోక్‌సభలో ప్రకటన వెలువరించారు. నక్సలిజం ని ర్మూలనలో ప్రభుత్వ ముందడుగును గురించి అ మిత్ షా ప్రస్తావించారు. బస్తర్ ఇప్పుడు వినూత్న రీతిలో బతుకుబాటలో సాగుతోందని, అభివృద్ధి పథంలో ముందుందని తెలిపారు. ఈ దిశలో సాధించిన విజయంలో ప్రతిష్ట అంతా కూడా భద్రతా బలగాలకు, స్థానిక పోలీసు బలగాలు, అక్కడి ఆదివాసీ తెగలకు చెందుతుందని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల ప్రమేయం వారి సహకారం లేకుండా ఈ బృహత్తర లక్షం నెరవేరడం దుర్ల భం అయ్యేది అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పునరావాస పథకాలను, సహాయక చర్యలను చేపట్టాయని.. క్రమంలోనే 4800కు పైగా నక్సల్స్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి చేరారని వెల్లడించారు. మూడేండ్లలో 706మంది నక్సల్స్‌ను మట్టుపెట్టారని, వీరిలో అగ్రశ్రేణి నక్సల్ నేతలు, పేరుమోసిన దళాల వారు ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లోని అటవీశాఖా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా సరైన విధంగా స్పందించారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే కేవలం రెండు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పునరావాస, సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇస్తూనే, మరో వైపు నక్సల్ కార్యకలాపాల ఆటకట్టుకు కటుతర చర్యలకు దిగిందని,ఈ ద్విముఖ వ్యూహం ఫలించిందని తెలిపారు. కాంగ్రెస్ వైఖరితోనే నక్సలిజం సమస్య 1970లో ఇందిరా గాంధీ రాజకీయ ఎత్తుగడ దుష్పలితం.. దేశంలో నక్సలిజం సంస్కృతి పెరిగిపోయి, అటవీ ప్రాంతాలు ఆదివాసి కేంద్రాలు క్రమేపీ మావోయిస్టు కేంద్రీకృత హింసాత్మక చర్యలకు వేదికలు అయ్యాయని అమిత్ షా తెలిపారు. ఇందుకు కారణం ఆయా ప్రాంతాల్లో చిరకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే అని విమర్శించారు. మారుమూల వెనుకబడ్డ ప్రాంతాలలో అభివృద్ధి ఫలాలు ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీలకు చేరవేయడంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్షం వహించారు. పైగా దళారి వ్యవస్థను పోషించడం ద్వారా ఈ ప్రాంతంలో ఆదివాసీలు తరాలుగా వెనుకబడ్డారని,ఈ క్రమంలోనే నక్సలిజం వేళ్లూనుకుందని అమిత్ షా తెలిపారు. తరువాతి క్రమంలో ఇది అదుపు తప్పి చివరికి తీవ్రస్థాయి హింసాత్మకతకు దారితీసిందన్నారు. నక్సలిజం అనేది అభివృద్ధి వాంఛతో తలెత్తలేదని , కేవలం వామపక్ష సిద్ధాంతాల భావజాలం వ్యాప్తితోనే జరిగిందని తెలిపారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ స్వార్థం కోసం ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు దేశంలో కొన్ని ప్రాంతాలలో కావాలనే వామపక్ష సిద్ధాంతాలను ప్రోత్సహించిందని తెలిపారు. కమ్యూనిజం కాదని, 1970 ప్రాంతంలో ఇందిరాగాంధీ ఏకంగా ఈ వామపక్ష తీవ్రవాద జాలాన్ని ఎంచుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం ఈ ఎత్తుగడకు దిగారని, దీనితో పలు ప్రాంతాల్లో నక్సలిజం పుట్టకువచ్చిందని అమిత్ షా విశ్లేషించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రగతి ఫలాలను అందించలేదు. పైగా గిరిజన ప్రాంతాలను నిర్లక్షం చేశాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాలను ఎంచుకుని వామపక్ష తీవ్రవాదం విస్తరించుకుందని, ఇన్నేళ్లకు మోడి ప్రభుత్వం ఈ జడల మర్రి ఊడలను దించిందని తెలిపారు. రేపటితో ఈ నక్సలిజం అంతం గడువు. నిర్ణీత లక్షం మేరకు దాదాపుగా సంపూర్తి అవుతుందన్నారు.  గద్దర్‌తో రాహుల్ చర్చలు దేనికి సంకేతం దేశంలో నక్సలిజం అంతం ప్రకటన దశలో హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తన సొంత బాజా కోసం దేశ భద్రతకు సవాళ్ల సమస్యలపై కూడా నిర్లక్షం వహించారని తెలిపారు. లోక్‌సభలో తమ ప్రకటన దశలో అమిత్ షా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈ యాత్రలో నక్సలైట్లకు చెందిన పలువురు వివాదాస్పద వ్యక్తులు , ప్రముఖులు వచ్చి ఆయనను కలిశారు. యాత్రలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణకు వెళ్లినప్పుడు రాహుల్ తన ప్రచార ఆర్బాటంలో భాగంగా గద్దర్, కొందరు అజ్ఞాత నేతలను కలుసుకునే వారని , దీనికి ప్రచారం కల్పించుకునేలా చేసుకున్నారని విమర్శించారు. నక్సల్స్ అనుబంధ సంస్థలు, సంఘాలతో రాహుల్ పరిచయాలు, మిత్రత్వ ప్రదర్శనలు ఎటువంటి సంకేతాలకు దారితీస్తాయనేది ఆలోచించారా? అని ప్రశ్నించారు. సాయుధ ఉద్యమాల పిలుపులను సహించేది లేదని, వారికి వంతపాడే వారిని కూడా ఉపేక్షించేది లేదని అమిత్ షా హెచ్చరించారు. మిగిలిన నక్సల్స్ ఆయుధాలు వీడితేనే వారితో చర్చల ప్రసక్తి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ తన గొంతును లోక్‌సభలో అణచివేస్తున్నారనే వాదనను అమిత్ షా తోసిపుచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలకు సభలలో మాట్లాడేందుకు 157 గంటల సమయం ఇచ్చారు. ఇక ప్రతిపక్ష నేత రాహుల్‌ను మాట్లాడేందుకు పలుసార్లు అవకాశం కల్పించారు. అయితే ఆయనే దీనిని వాడుకోలేదు. పక్కదారితో సభల నుంచి వెళ్లిపోతూ వచ్చారని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 6:00 am

31stMarch2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

31stMarch2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 31stMarch2026 |

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:00 am

మంగళవారం రాశి ఫలాలు (30-03-2026)

మేషం బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిధునం సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి. కర్కాటకం ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సింహం చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. కన్య చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. తుల కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వృశ్చికం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధనస్సు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుంభం మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. మీనం ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.  

మన తెలంగాణ 31 Mar 2026 12:00 am

నల్లగొండలో గురుకుల పాఠశాలలో ఘటనపై వివాదం

నల్లగొండలో గురుకుల పాఠశాలలో ఘటనపై వివాదం ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా దామరచర్లలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:14 pm

రాబోయే మూడేళ్లలో రూ.70 వేల కోట్లతో రోడ్లు: మంత్రి వెంకట్ రెడ్డి

హ్యామ్ విధానంలో వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం గ్రామీణ రోడ్లతో రైతులు, విద్యార్థులు, రోగులకు మెరుగైన సౌకర్యాలు జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం గేమ్ ఛేంజర్‌గా మారనున్న త్రిబుల్ ఆర్, గ్రీన్ ఫీల్ ఎక్స్‌ప్రెస్‌వే అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే మూడు సంవత్సరాల్లో 70 వేల కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి రోడ్లు భవనాలు శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, లక్ష్యాలు గురించి శాసన సభలో ప్రసంగించారు. మంచి రోడ్లు ఉంటే పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. రోడ్ల అభివృద్ధి ద్వారా మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడి, పరిశ్రమలు విస్తరించి సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధితో రైతులకు పంట మార్కెట్‌కు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు విద్య కోసం సులభంగా ప్రయాణిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు సమయానికి (గోల్డెన్ అవర్ లో) ఆసుపత్రులకు చేరుకోవచ్చని వివరించారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మోర్త్ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో, 1.6 లక్షల మంది మరణించారని తెలిపారు. రాష్ట్రంలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. డబ్బు పోతే తిరిగి వస్తుందని, ప్రాణం పోతే తిరిగి రాదని అన్నారు. రోజుకు సగటున 18 నుండి 20 మంది మరణించడం విచారకరమని, ఇందులో ఎక్కువగా యువతే ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఇటీవల చేవేళ్ల-, మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు అభివృద్ధి అనేది కేవలం మౌలిక వసతుల నిర్మాణం కాకుండా ప్రాణాలను కాపాడే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 34,062 కి.మీ రోడ్డు నెట్‌వర్క్ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7,590 కోట్లతో 1,835 కి. మీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రూ. 13,051 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గత 27 నెలల్లో 595 కి.మీ రోడ్లు, 51 వంతెనలు పూర్తి (రూ. 1,035 కోట్లు) 323 కి.మీ రోడ్లు, 16 వంతెనలు (రూ. 485 కోట్లు) పూర్తయినట్లు వివరించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటి మోడల్) అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానంతో 12,000 కి.మీ రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్-1లో 6,092 కి.మీ రోడ్లును సుమారు రూ. 13,006 కోట్ల వ్యయంతో 30 నెలల్లో నిర్మాణం, 15 సంవత్సరాల నిర్వహణ ఉంటుందని వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్), హైదరాబాద్ నుంచి- విజయవాడ ఆరు లేన్ల విస్తరణ, అమరావతి నుంచి బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు (చెన్నై, పూణే, బెంగళూర్) లాంటి నగరాలను కలుపుతూ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. బుల్లెట్ ట్రైన్స్ కోసం కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీలో శంషాబాద్ దగ్గరలో 500 ఎకరాలు ప్రభుత్వం కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయన్నారు. వేగంగా కొనసాగుతున్న ఉస్మానియా, హైకోర్టు కొత్త భవనాల పనులు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు రాష్ట్ర ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో పలు కీలక నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు మంత్రి తెలియజేశారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మణం జరుగుతోందని, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉండగా, పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అదే విధంగా నగర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని నాలుగు వైపులా అధునాతన ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ. 8,000 కోట్ల వ్యయంతో నాలుగు పెద్ద ఆస్పత్రులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి దాదాపు రూ. 2,000 కోట్ల వ్యయంతో జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 11:12 pm

ఫ్యాక్ట్ చెక్: రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేశారు

రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:58 pm

మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధప్రదేశ్..

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఎపి డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డిజిపి ప్రకటించారు. లొంగిపో యిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, ఆంధ్రాఒడిశా సరిహద్దు (ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణ రావు తలపై రూ.25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు కర్తం లచ్చు (రూ.5 లక్షల రివార్డు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే(తలో రూ. 4 లక్షల రివార్డు), మాదివి అడా మా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (తలో రూ.1 లక్ష రివార్డు) వంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 20,000 అందజేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది. పభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు రావడంతో ఉద్యమ ఉనికి తగ్గుతోందని, అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు సోమన్న వివరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందాడు. గత ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణించిన తర్వాత, ఏవోబీ బాధ్యతల్ని సోమన్న చేపట్టారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. ఎపి ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చిన సోమన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాయుధ పోరాటం ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఏవోబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి విఘాతంగా మారుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. గతంలో అగ్రనేతగా ఉన్న గణపతి వంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావి ధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేదేమీ లేద ని, అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకుని నలిగి పోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి. ఎపి పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా నిలబెట్టాయి.

మన తెలంగాణ 30 Mar 2026 10:07 pm

ഫാക്ട് ചെക്ക്: സൌദി രാജകൊട്ടാരത്തിൽ വെടിവെപ്പ്? പ്രചാരണത്തിൻ്റെ വസ്തുതയെന്ത്

ഇറാൻ ആക്രമണത്തിനെതിരെ സൌദി രംഗത്തെത്തിയതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:02 pm

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:53 pm

కాంగ్రెస్ పాలనలోనూ ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు: విజయశాంతి ఆవేదన

ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత నిర్లక్ష్యం చేస్తే అది చారిత్రక తప్పిదమే మండలిలో ఎంఎల్‌సి విజయశాంతి ఆవేదన మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై శాసనమండలిలో ఎంఎల్‌సి విజయశాంతి తన గళం వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సోమవారం ఆమె సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఉండేవారా? అని ప్రశ్నించారు. పదవుల కంటే ముందు వారి త్యాగాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడమనేది ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తిస్తే అది చరిత్రగా నిలుస్తుంది. లేని పక్షంలో వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు. ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం ఇస్తామని భరోసా కూడా ఇచ్చామన్నా . ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎంఎల్‌సి విజయశాంతి వివరించారు. ఉద్యమ కారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్ 2వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని అది కూడా ఇంకా నెరవేరలేదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి ప్రభుత్వానికి ఆమె సూచించారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:35 pm

ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో ప్రభుత్వాలు..

ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీసం శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పీఎం శ్రీ పథకం కింద ఇతర స్కూళ్లలో ఇస్తున్నట్టే ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కెజిబివిల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతినెలా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ఆమె కోరారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:22 pm

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story (

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:12 pm

ప్రధాని మోడీ ఫొటో పెడతాం: సిఎం రేవంత్

హైదరాబాద్: సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ.14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని సిఎం చెప్పారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. సన్న బియ్యం పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని సిఎం అన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:04 pm

స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు

హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్, గౌరవ ఉప సభాపతి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, చెస్, కేరంలు వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు. ఈ హ్యాకథాన్‌లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను ప్రత్యేక స్మారక గ్రంథంగా (Souvenir) ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. “క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు — అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడం ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడలు మరియు ఆవిష్కరణల రంగంలో ముందంజలో ఉందని మరోసారి రుజువైంది.

మన తెలంగాణ 30 Mar 2026 8:56 pm

జిఒ 317 బాధితులకు న్యాయం చేయండి: సిఎంకు కవిత లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాలు, జోన్‌లలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాలు, జోన్‌లలో పోస్టింగ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారని గుర్తు చేశారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాటు చేయడానికి అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జిఒ నంబర్ 317 జారీ చేసిందని తెలిపారు. కానీ, ఆ జిఒలోనూ స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిఒ 317తో ఉద్యోగులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.  

మన తెలంగాణ 30 Mar 2026 8:44 pm

రేవంత్ సర్కార్‌పై కాగ్ అక్షింతలు: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్ అప్పులు తెచ్చారు..కానీ ఆస్తులు పెంచలేదు కాగ్ రిపోర్టుతో అయినా కళ్లు తెరవండి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నివేదిక స్పష్టం చేసిందని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. కాగ్ రిపోర్టు రేవంత్ సర్కార్‌కు చెంప పెట్టు లాంటిదని విమర్శించారు. తాము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని ఒక ప్రకటలో పేర్కొన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందని చెప్పారు. అంకెల్లో గోల్ మాల్.. ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందని, రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. మాటలు మూరెడు-చేతలు చారెడు కూడా లేవని ఈ చేవ లేని సర్కార్‌కు కాగ్ అక్షింతలు వేసిందని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని తప్పుబడితే పెడబొబ్బలతో తమ మీద దాడి చేస్తారని, కాగ్ రిపోర్టు తర్వాత కూడా ఇంకా ఆవే అబద్దాలను కొనసాగిస్తారా..? అని ప్రశ్నించారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టులోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాలను తప్పు పట్టిందని, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024 -25 కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనడానికి కాగ్ రిపోర్టు మరో ఉదాహరణ అని, ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చి కూడా ఆరు గ్యారంటీలను అమలు చెయ్యలేని అసమర్ధ సర్కార్ ఇది అని కాగ్ పరోక్షంగా తప్పుపట్టిందని పేర్కొన్నారు. కాగ్ నివేదికతోనైనా కళ్ళు తెరవాలని, పిచ్చి కూతలు మాని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బలంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పునాదులు ధ్వంసం చేసి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చొద్దని, ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలికి పాలన మీద దృష్టి సారించాలని హితవు పలికారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:40 pm

శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన ఏఎస్‌బిఎల్

 హైదరాబాద్ : భక్తి, వేడుకలు, సంగీతం, సంస్కృతి, ఐక్యతతో నిండిన ఒక మహోన్నత కార్యక్రమాన్ని ఏఎస్‌బిఎల్ నిర్వహించింది. శ్రీరామ నవమి పురస్కరించుకుని ఏఎస్‌బిఎల్ ఆర్‌టిసి ఎక్స్ రోడ్స్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఏఎస్‌బిఎల్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అజితేష్ కొరుపోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కళ్యాణం యొక్క పవిత్రత నుండి దాని తర్వాత జరిగిన ప్రదర్శనల సౌందర్యం వరకు, ఈ సాయంకాలం ప్రతి అంశం వేడుకలను సజీవంగా, హృద్యంగా, చిరస్మరణీయంగా మార్చాయి. ఈ సాయంకాలం అతిపెద్ద ఆకర్షణలలో ఒకటిగా కోటికి పైగా రామ నామాలను వ్రాసే రికార్డు ప్రయత్నం నిలిచింది. ఇది శ్రీరామునిపై ప్రజలకు ఉన్న ప్రేమ, విశ్వాసాన్ని ప్రతిబింబించింది. ఈ వేడుకలలో భాగంగా నృత్య ప్రియ కూచిపూడి ప్రదర్శన కూడా జరిగింది, ఇది వేడుకకు చక్కదనాన్ని, శాస్త్రీయ సౌందర్యాన్ని అందించింది. రామచారి గారి విద్యార్థుల ప్రదర్శనలు ఈ సాయంకాలానికి మరింత ఆకర్షణను, సాంస్కృతిక వైభవాన్ని జోడించాయి. భజనలు, రామాయణ నాటిక, గాయని సునీత హృద్యమైన గీతాలాపనలు సాయంకాలపు ఉత్సాహాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాయి. ఏఎస్‌బిఎల్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ రామనవమి వేడుకలను జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయనే మాట్లాడుతూ సంప్రదాయ వేడుకలను ఇలా సమిష్టిగా జరుపుకోవటం ద్వారా కమ్యూనిటీ భావన నివాసితులలో కలుగుతుంది ఈ తరహా వేడుకలను తమ ప్రాంగణాలలో మరింత వేడుకగా జరపటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఈ వేడుకలకు హాజరైన ప్రముఖులలో సుమ కనకాల, ఐశ్వర్య రాజేష్, లాస్య మంజునాథ్, గాలి మహేశ్వరి, నీలి మేఘాలలో, శివ జ్యోతి, హిమజ మల్లారెడ్డి, విష్ణుప్రియ, పూజా వేగేశ్న, నిఖిల్ విజయేంద్రసింహ, అలేఖ్య హారిక ఉన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:40 pm

వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. తల్లి, కుమారుడి మృతి

తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడిన తల్లి.. కుమారుడు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

మన తెలంగాణ 30 Mar 2026 8:31 pm

ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక ‘క్రూరమైన ఆయుధం’గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు. అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగిందని, ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ‘ఫేక్ న్యూస్’గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తుచేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి..? అని ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును పునర్విమర్శించాలని, ప్రజాస్వామ్య విలువులను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:27 pm

ఇందిరమ్మ ఇళ్లు.. లబ్దిదారులకు గుడ్ న్యూస్

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తుది విడత బిల్లుల విడుదలకు ఉన్న నిబంధనల్లో కొన్నిమార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, త్వరగా గృహ ప్రవేశాలు చేసేందుకు వీలుగా ఈ మేరకు కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఇంటి నిర్మాణపు పనులు సమగ్రంగా పూర్తయిన తరువాతనే క్షేత్ర స్థాయి సిబ్బంది ఫొటోలను అప్‌లోడ్ చేసి తుది బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాలని గతంలో నిర్ధేశించగా, లబ్దిదారులు తాము నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశం చేసుకున్న తరువాత కూడా కొన్ని పనులను చేపట్టేందుకు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఇళ్లలో నివసించేందుకు అనువైన వసతులు, పరిస్థితులుంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయి నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ, చిన్న పనులు కాకపోవడంతో బిల్లుల విడుదల కాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సూచనలు, లబ్ధిదారుల ఇబ్బందులు మొదలైన అంశాలపై నిశితంగా అధ్యయనం చేసిన తరువాత కొన్ని అంశాల్లో సడలింపు ఇస్తున్నట్లు ఎండి పేర్కొన్నారు. అందులో ప్రధానంగా లోపలి వైపు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, తలుపులు(దర్వాజాలు), పూర్తి స్థాయి విద్యుత్ వైరింగ్, ప్లబింగ్ వంటి పనులను లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకున్న తరువాత వీలును బట్టి పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ సడలింపుల వల్ల ఇందిరమ్మ లబ్దిదారులకు తుదివిడత బిల్లు రూపేణా చెల్లించాల్సిన మొత్తం విడుదలై, వారికి ఆర్ధికంగా వెసులు బాటు కలుగుతుందని ఆయన వివరించారు. ఈ మేరకు, సవరించిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి బిల్లుల ప్రతిపాదనలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎండి ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలు ఇలా... కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టరింగ్ ఇంటి వెలుపలి వైపు పూర్తి కావాలి.(లోపలి వైపు ప్లాస్టరింగ్ గృహ ప్రవేశం తరువాత కూడా చేసుకోవచ్చు.) ఫ్లోరింగ్ తప్పనిసరి కాదు (ఆయా లబ్దిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి ఫ్లోరింగ్ చేసుకునే వెసులుబాటు) కల్పించారు. కలరింగ్ - వెలుపలి భాగంలో చేయాల్సి ఉంటుంది. (రెండో కోట్ కలరింగ్‌ను ఇంటిలో నివసిస్తూ, వినియోగిస్తూ కూడా చేసుకోవచ్చు). ఇంటి వెలుపలి దర్వాజాలు ఏర్పాటు చేసుకోవాలి. (లోపలి వైపునవి ఇంటిలో నివసిస్తూ కూడా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు), విద్యుత్ వైరింగ్ తుది బిల్లు విడుదలకు తప్పనిసరి కాదు. (వైరింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ పాత ఇంటి కనెక్షన్ ద్వారా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు). ప్లంబింగ్ - పనులు ఇంటిలో నివసిస్తూ చేసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది విడత బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం ఉత్తర్వులు జారీ చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:16 pm

globalstar |ఇలా ఉంటుందా ఆయన డైట్!

globalstar | ఇలా ఉంటుందా ఆయన డైట్! globalstar | రామ్ చరణ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:12 pm

హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు..

హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు.. హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:12 pm

ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు

ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు 50 ఏళ్ల పాఠశాలలో సీనియర్ విద్యార్థులందరి

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:03 pm

చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా…

చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో గత

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:00 pm

AA25: Allu Arjun’s Superhero Films Loading

Icon Star Allu Arjun is currently shooting for his 22nd film directed by Atlee. The film is slated for summer release. The actor is in talks for several films. He is in talks with Malayalam actor and director Basil Joseph for a film and the discussion has been going on from a long time. Allu […] The post AA25: Allu Arjun’s Superhero Films Loading appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 7:55 pm

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి…

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి… అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:54 pm

అమెరికా విమానాలకు గగనతలాన్ని మూసేసిన స్పెయిన్

అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో పాలు పంచుకొనే విమానాలను అనుమతించమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గెరెటా రొబెల్స్ సోమవారం వెల్లడించారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడాన్ని ఇప్పటికే స్పెయిన్ నిరాకరించింది. ‘‘ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం మిలిటరీ స్థావరాలు లేక గగనతలాన్ని వియోగించడానికి అనుమతి ఇవ్వబోం. ఏక పక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించకూడదని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే తాజా ప్రకటన వచ్చింది’’ అని రక్షణ, ఆర్థిక మంత్రులు స్థానిక మీడియాలో వెల్లడించారు.

మన తెలంగాణ 30 Mar 2026 7:52 pm

సోషల్‌ మీడియాలో నకిలీ ఐడీలు

సోషల్‌ మీడియాలో నకిలీ ఐడీలు ఖమ్మం, ఆంధ్రప్రభ : సాంకేతికతను వినియోగించుకొని కొందరు

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:50 pm

ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు

ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు ఆస్తిపన్ను చెల్లించని వారిపై

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:45 pm

భక్తులకు మిషన్ భగీరథ త్రాగు నీటి సేవలు

భక్తులకు మిషన్ భగీరథ త్రాగు నీటి సేవలు లోతట్టు ప్రాంతాల్లోనూ తాగునీటి ఏర్పాట్లు

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:40 pm

ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు..

ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు.. తెలంగాణ ఉద్యమకారుడు జన్నె యుగేందర్, చిట్యాల,

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:37 pm

అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు..

అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు.. మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:35 pm

మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం…

మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:27 pm

బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి,

బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి, జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన నవాబుపేట రైతులు,

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:25 pm

రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం

రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:23 pm

Video : Director Abhilash Reddy Kankara Exclusive Interview

The post Video : Director Abhilash Reddy Kankara Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 7:21 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. బర్సాపరా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది రవీంద్ర జడేజా చెన్నై నుంచి రాజస్థాన్‌కి, సంజూ శాంసన్ రాజస్థాన్‌ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో వాళ్ల మాజీ జట్టుపై ఈ ఆటగాళ్లు ఎలా ప్రదర్శిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. తుది జట్లు: సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మ్యాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్‌టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్. ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురేల్(కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ.

మన తెలంగాణ 30 Mar 2026 7:20 pm

మడూరు స్టేజ్ వద్ద ఎక్స్ బస్సులను ఆపాలి

మడూరు స్టేజ్ వద్ద ఎక్స్ బస్సులను ఆపాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:19 pm

పేదరికం నిర్మూలించడమే లక్ష్యం..

పేదరికం నిర్మూలించడమే లక్ష్యం.. స్వర్ణాంధ్ర లక్ష్యంగా పి4 పథకం…ఉరవకొండలో ఘనంగా వార్షికోత్సవం ఉరవకొండ

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:14 pm

ఆ ఆడియోపై విచారణ జరిపించండి: సిపిఎం

హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్ 2 కోట్ల లంచం అడిగినట్లు మాట్లాడిన ఆడియోపై విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం బిల్డర్ దగ్గర రూ.2 కోట్లు లంచం అడిగినట్లు ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం కటినంగా శిక్షించాలని సిపిఎ గ్రేటర్ హైదరాబాద్ సెంటురల్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తనకు ఇప్పటికే 25 లక్షలు ముట్టినట్టు మాట్లాడారని, ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇచ్చినట్టు అంటున్నారని ఆయనన్నారు. ఈ అంశంలో ఎవరి పాత్ర ఎంత ఉన్నది అనేది బయటికి రావాలన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 7:13 pm

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి:

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:09 pm

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది: అమిత్ షా

న్యూఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటారు కానీ హింసను ఎలా సమర్థిస్తారు అని ప్రశ్నించారు. కాంబోడియా, పెరూ, కొలంబియాలో భయంకర రక్తపాతం జరిగిందని పేర్కొన్నారు. ‘‘దేశాభివృద్ధికి మావోయిస్టు సిద్ధాంతాలు, విధానాలు తీవ్ర ఆటంకం. మావోయిస్టుల రక్తపాత సిద్ధాంతాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బస్తర్‌లో నక్సల్స్ అనేక ఏళ్లపాటు సమాంతర ప్రభుత్వం నడిపారు. ఆయుధాలు వీడాలని బస్తర్ వెళ్లి పలుసార్లు కోరాం’’ అని అన్నారు. నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘నక్సలిజంపై పోరులో ప్రజలు కూడా మాకు అండగా నిలిచారు. వేల మంది సైనిక బలగాలు, పోలీసులను నక్సల్స్ చంపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు.. హింస కాదు. బస్తర్ యువకులను కలిశా.. వాళ్లందరూ నక్సలిజాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావు లేదు. ఎన్డిఎ పాలనలో మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. నక్సలైట్ల ఎజెండాలో అభివృద్ధి అన్నది లేదు. నక్సలైట్లు తమ ఉనికి కోసమే పోరాడుతున్నారు. నక్సలైట్లు.. భగత్‌సింగ్, బిర్సాముండా కారు. వాళ్లతో నక్సలైట్లను పోల్చకూడదు. ప్రజలను చంపేవారు దేశభక్తులు ఎలా అవుతారు? నక్సలైట్లు తమ సిద్ధాంతాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు’’ అని అమిత్ షా తెలిపారు. నక్సలైట్లకు ఆదర్శం భారతీయులెవరూ కాదు.. వారికి మావో ఆదర్శమని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. నక్సల్స్.. చిన్న పిల్లలకు తుపాకులు, ఆయుధ సామాగ్రి ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల యువత జీవితాలను నక్సల్స్ నాశనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. విద్య, వైద్య, మౌలిక వసతులను కూడా నక్సల్స్ ధ్వంసం చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. రాజ్యాంగాన్ని స్వీకరించాం. ఆయుధాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తీయాలని ఏ సిద్ధాంతాలు చెప్పాయి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని నక్సల్స్ గ్రహించాలి. స్కూళ్లు, బ్యాంకులు, ఆస్పత్రులు తగలబెట్టేవారి వల్ల అభివృద్ధి ఎలా సాధ్యం? ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది. ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది’’ అని అమిషా ధ్వజమెత్తారు.  

మన తెలంగాణ 30 Mar 2026 6:58 pm

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జిందాల్ స్టెయిన్‌లెస్ ఒప్పందం

భారతదేశపు ప్రముఖ స్టెయిన్‌లెస్ స్టీల్ తయారీ సంస్థ అయిన జిందాల్ స్టెయిన్‌లెస్, టీ20 లీగ్ జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)కు అధికారిక స్టెయిన్‌లెస్ భాగస్వామిగా చేరుతున్నట్లు వెల్లడించింది. జిందాల్ స్టెయిన్‌లెస్‌కు ఐపీఎల్ తో ఇది మొట్టమొదటి అనుబంధం. ఈ అనుబంధం ద్వారా స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు , ట్యూబులు, స్టెయిన్‌లెస్ స్టీల్ రీబార్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటసామాగ్రి, సింక్‌ల వంటి కీలక ఉత్పత్తుల విభాగాలలో కంపెనీకి ప్రత్యేక బ్రాండింగ్ హక్కులు లభిస్తాయి. ఈ భాగస్వామ్యంపై జిందాల్ స్టెయిన్‌లెస్ మేనేజింగ్ డైరెక్టర్, అభ్యుదయ జిందాల్ మాట్లాడుతూ “అగ్రశ్రేణి ఐపిఎల్ జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి, ఇది తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను నిరంతరం అలరిస్తూనే ఉంది. వినియోగదారులతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకునే దిశగా మా బ్రాండ్ ప్రయాణంలో ఎస్ఆర్హెచ్ తో మా భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ముందడుగు. దేశంలోని పలు ప్రాంతాలలో మా కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉన్నందున, ఈ భాగస్వామ్యం రోజువారీ వినియోగంలో స్టెయిన్‌లెస్ స్టీల్ యొక్క వైవిధ్యతను, సమర్థతను ప్రదర్శించడానికి సహాయపడుతుంది” అని అన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, కె. షణ్ముగం మాట్లాడుతూ “జిందాల్ స్టెయిన్‌లెస్‌ను మా అధికారిక స్టెయిన్‌లెస్ భాగస్వామిగా పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం విభిన్న వర్గాలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడటంతో పాటు, రెండు బ్రాండ్‌లకు దీర్ఘకాలిక విలువను సృష్టిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు. జిందాల్ స్టెయిన్‌లెస్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ విజయ్ శర్మ మాట్లాడుతూ “సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి అత్యంత చురుకైన ఫ్రాంచైజీతో కలిసి పనిచేయడం ద్వారా, మేము మరింత స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే బ్రాండ్ కథనం ద్వారా బలమైన గుర్తింపును సృష్టిస్తున్నాము. ఈ భాగస్వామ్యం, అత్యంత ప్రభావవంతమైన క్రీడా సీజన్‌లో మా విస్తృత భాగస్వాములకు దాని విలువను అందించడంలో, అలాగే బలమైన కో-బ్రాండెడ్ ప్రచారానికి మద్దతు ఇవ్వడంలో కూడా మాకు సహాయపడుతుంది” అని అన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 6:50 pm

ప్రహరీ గోడను కూల్చివేసిన దుండగులు

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ పట్టణములోని సూర్యాపేట రోడ్డులో ఇంటి స్థలం పై

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:30 pm

dark circles |కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు

dark circles | కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు dark

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:16 pm

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి మునుగోడు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:16 pm

వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి :

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:13 pm

Telangana : టార్గెట్ పొంగులేటి.. బీఆర్ఎస్ లక్ష్యమదేనా?

బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 6:12 pm

బంగారు గని వద్ద కాల్పులు.. 70 మందికి పైగామృతి

దక్షిణ సూడాన్‌ మరోసారి మృత్యుఘోషతో విలవిలలాడిపయింది. రాజధాని జుటా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఓ బంగారు గనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 70 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని పోలీసులు తెలిపారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ ‘సూడన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఇన్ అపోజిషన్’ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది.

మన తెలంగాణ 30 Mar 2026 6:12 pm

గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి

గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : 99 రోజుల

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:08 pm

హనుమాన్ విజయోత్సవ ర్యాలీ..

హనుమాన్ విజయోత్సవ ర్యాలీ.. కడెం, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:58 pm

అఖిలపక్ష నాయకుల సమావేశం..

అఖిలపక్ష నాయకుల సమావేశం.. లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:55 pm

దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ.. భువ‌న‌గిరి, ఆంధ్ర‌ప్ర‌భ : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:53 pm

ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ

ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లిగ్రామంలోలో గల

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:53 pm

Naga Chaitanya’s Vrushakarma Updates

Akkineni youngster Naga Chaitanya has spent over a year on his upcoming film Vrushakarma. The shoot of the film is currently in the final stages. The first glimpse received terrific response and the makers have closed the non-theatrical and the theatrical rights of the film. The team is now heading to Rajasthan to shoot for […] The post Naga Chaitanya’s Vrushakarma Updates appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 5:51 pm

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు సామాన్య ప్రజలపై భారం పడొద్దని

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:51 pm

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 5:46 pm

Chandrababu : 2029 నాటికి అందరికీ ఇళ్లు

2029 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 5:33 pm

1chance |సినీ హీరోలు రాజకీయాల్లోకి..

1chance | సినీ హీరోలు రాజకీయాల్లోకి.. 1chance | విజయ్, పవన్ కేల్యాణ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:29 pm

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి బాధితురాలికి అప్పగింత..

లింగాపూర్, ఆంధ్రప్రభ ; సిర్పూర్ (యు) మండలానికి చెందిన ఓ మహిళ తన

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:28 pm

పేదవాడి సొంతింటి కల సాకారం..

పేదవాడి సొంతింటి కల సాకారం.. జిల్లాలో ఘనంగా గృహప్రవేశాలు.పాల్గొన్న మంత్రి టీ.జీ. భరత్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:27 pm

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్‌ను అరికట్టేందుకు […] The post క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:25 pm

జీజీహెచ్‌లో అద్భుత శస్త్రచికిత్స..

జీజీహెచ్‌లో అద్భుత శస్త్రచికిత్స.. ఏడు సంవత్సరాల బాలుడికి కొత్త జీవితంఅరుదైన ‘నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా’పై

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:23 pm

కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి…

కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి… ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:23 pm

చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా […] The post చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:21 pm

ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్

పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే […] The post ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:18 pm

రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు […] The post రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:14 pm

నటుడు బ్రహ్మానందంను కలిసిన చిత్రకారుడు రాయబోస్

కడెం, ఆంధ్రప్రభ : తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:11 pm

కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు

విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి, […] The post కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:10 pm

రెన్యువల్స్ గురించి భయపడొద్దు..

రెన్యువల్స్ గురించి భయపడొద్దు.. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ శ్రీవాస్ నూపూర్ అజయ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:08 pm

అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్‌వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ, […] The post అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:07 pm

Cancer |మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్

Cancer | మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ Cancer | ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:04 pm

హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఏలేటి

హైదరాబాద్: హేట్ స్పీచ్ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్ స్పీచ్ బిల్లు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లును సెలక్ట్ కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి.. ప్రజల గొంతు నొక్కడానికి కాదని విమర్శించారు. ఇలాంటి చట్టం చేసేముందు హౌస్ కమిటీ వేయాలని.. చర్చ సాగాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అని.. హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. 

మన తెలంగాణ 30 Mar 2026 5:02 pm

వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు..

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్ […] The post వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:01 pm

కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది..: సిఎం రేవంత్

హైదరాబాద్: మీడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వల్లే తన గొప్పతనం ఏంటో తెలంగాణ సమాజానికి తెలిసిందని రేవంత్ అన్నారు. అసలు కెసిఆర్ లేకపోతే.. తాను లేనంటూ చెప్పుకొచ్చారు. ‘కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. కెసిఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ, ఆయన్ను గృహ నిర్భందం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీశ్ రావు ప్రమాదం’ అని సిఎం పేర్కొన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 5:00 pm

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ బెల్లంపల్లిలో డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికుల ధర్నా

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:59 pm

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి […] The post పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 4:58 pm